– రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి
– జిల్లాలో ఒకేరోజు 25 పౌర పఠన మందిరాలు ప్రారంభం
– లలితానగర్ లో కార్యక్రమాన్ని ప్రారంబించిన మంత్రి
– నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వంలో మహర్దశ పట్టిందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన 25 పౌర పఠన మందిరాలను, దశాబ్ది ఉత్సవాల విద్యాదినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని లలితానగర్లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్లతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిఆర్ఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాల సేవలను విస్తృత పరచాలనే లక్ష్యంతో పౌర పఠన మందిరాల (పబ్లిక్ రీడింగ్ రూమ్స్) ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పైలెట్ ప్యాజెక్టు కింద మొదటి దశల జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంబించామని అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతమైందని, ప్రజలకు గ్రంథాలయ సేవలు మరింత చెరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యప్తంగా దశలవారిగా చేపట్టి విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ గ్రంథాలయాలను విస్తరించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న వేళ గ్రంథాలయాలను అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, అడీషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ , పౌర గ్రంథాలయాల డైరెక్టర్ శ్రీనివాసచారి, ఉప సంచాలకులు శ్రీహరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్ కుమార్, మీర్పేట్ మేయర్ దుర్గ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మాధవి, కార్పొరేటర్లు సిద్దాల పద్మ, అర్కాల భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, మున్సిపల్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి, గ్రంథపాలకులు సత్యనారాయణ, జైహింద్ తదితరులు పాల్గొన్నారు.