– అడ్డుదారుల గుండా సరిహద్దులు దాటుతున్న అక్రమ ఇసుక రవాణాను ఆపేది ఎవరు,
– మంజీరా టు మహారాష్ట్ర ఇసుక తరలింపు
– ట్రాక్టర్లు పడుతున్నారు టిప్పర్లు వదులుతున్నారు
– మండల ప్రజల్లో ఆరోపణ
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ అడ్డుదార్లగుండా సరిహద్దులు దాటుతూ మహారాష్ట్రకు అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది ఈ ఇసుక రవాణా మంజీరా నది టు మహారాష్ట్రకు తరలిపోతుంది. ఇంటి నిర్మాణాల కోసం అక్రమంగా ఇసుక తరలించే టాక్టర్ల పట్ల అధికారులు నిఘా పెడుతూ పట్టుకుంటున్నారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా సరిహద్దులు దాటిస్తూ మహారాష్ట్రకు తరలిపోతుంటే అలాంటి టిప్పర్లకు సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండల ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండ్లు నిర్మించుకునే వారికి ఇసుక కొనుగోలు చేయాలంటే నాలుగు వేల రూపాయల కు ఒక ట్రాక్టర్ చొప్పున లభిస్తోంది. ట్రాక్టర్లను పట్టుకోవడం ఆ తర్వాత ఇసుక అక్రమ రవాణా దారులు మరింతగా రేట్లు పెంచుతూ ఇసుకను అమ్ముకుంటున్నారు. పెద్దపెద్ద టిప్పర్లు అక్రమ ఇసుక రవాణా జరుపుతుంటే అలాంటి వాహనాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా పట్ల ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు నిగా పెట్టి అడ్డుదారులకుండా సరిహద్దులు దాటకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.