నవతెలంగాణ -న్యూఢిల్లీ: ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగిసిపోయింది. సోమవారం నాటి సమావేశంతో పాత పార్లమెంటు భవనానికి సభ్యులు వీడ్కోలు పలికారు. దీంతో నేటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మించిన సెంట్రల్ విస్టా సరికొత్త వేదికగా నిలువనుంది. ఈ రోజు ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగత ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. లోక్సభ చాంబర్లో 888 మంది సభ్యులు, రాజ్యసభ చాంబర్లో 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. ఉభయ సభల సమావేశం జరిగినప్పుడు లోక్సభ చాంబర్లో 1280 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఇకపై పూర్తిగా పేపర్లెస్గా కార్యకలాలు కొనసాగనున్నాయి. సభ్యునికి ట్యాబ్ ఇవ్వనున్నారు. అందులోనే సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇక ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించిన మైక్రోఫోన్లకు ఒక ప్రత్యేక సిస్టమ్ ఉంది. ఎంపీలకు ప్రసంగం కోసం కేటాయించిన నిర్ణీత సమయం ముగిసిన వెంటనే వారి మైక్రోఫోన్స్ బంద్ కానున్నాయి. ఇక సమావేశాల సందర్భంగా సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నిరసనలు తెలుపడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త భవనంలో అలాంటి వాటికి వీలులేదు. పార్లమెంట్కు ఆరు ద్వారాలు ఉన్నాయి.