అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి కొప్పుల ఈశ్వర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుకుంటుందనీ, వారికి అండగా ఉంటుందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో మైనార్టీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉందని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం పథకాన్ని మైనార్టీల అభ్యున్నతికి ఉపయోగించుకోవాలని సూచించారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌కు రూ.270 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్దిదారుడికి రూ.లక్ష ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికి విద్య అందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నిరుపేద మైనార్టీ విద్యార్ధులు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పథకం కింద ఒక్కో మైనార్టీ విద్యార్ధికి రూ.20 లక్షలకు పైగా ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు అబ్దుల్‌ అహ్మద్‌ బీన్‌ బలాలా, జాఫర్‌ హుస్సేన్‌, కాలేరు వెంకటేష్‌, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌ ఇషాక్‌, ్‌ రాజేశ్వర్‌ రావు, మైనార్టీ వెల్ఫేర్‌ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావు, హజ్‌ కమిటీ చైర్మెన్‌ తారిక్‌ అన్సారీ, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్‌ హసన్‌ ఇప్తారియా, వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మెన్‌ మసివుల్లా ఖాన్‌, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఎండీ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.