నవతెలంగాణ-హైదరాబాద్ : శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటుచేస్తామని పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రం అడిగితే గిరిజన యూనివర్శిటీ కోసం 360 ఎకరాల భూమిని ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు వర్శిటీని ఎందుకు నెలకొల్పడం లేదని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ద్వారా పెడుతామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది. కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. కాని నేడు మోసం చేస్తున్నారు. రైళ్లను తయారు చేసే కోచ్ బదులు మరమ్మతులు చేసే దుకాణం పెడుతున్నారు. ఇది ఎంతో అన్యాయమని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని, ఇచ్చిన హామీలపై వరంగల్ పర్యటనలో ప్రధాని మోడీ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.