నవతెలంగాణ-హైదరాబాద్
భారీ వర్షాలు, వరదల నేపథ్యలో ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారికి సైతం పరిపాలన అనుమతుల అధికారం కల్పిస్తూ సీఎం కేసిఆర్ ఆర్ అండ్ బీ శాఖను పునర్వ్యస్థీకరించారని గుర్తు చేశారు. ఇది విప్లవాత్మక నిర్ణయమన్నారు. అందుకు అనుగుణంగా డీఈ నుంచి ఆ పై స్థాయి అధికారి వరకు ప్రత్యేకంగా నిధులు అందుబాటులో ఉంచారని తెలిపారు. డీఈ స్థాయి అధికారి కూడా స్థానిక పరిస్థితులకు అనగుణంగా తక్షణం రోడ్ల మరమ్మతు కోసం నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. డీఈ రూ. 2లక్షలు, ఈఈ రూ. 25 లక్షలు, ఎస్ఈ రూ. 50 లక్షలు, సీఈ రూ. కోటి, ఈఎన్నీ రూ. 20 కోట్ల వరకు రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం నిధులు వినియోగించేలా చర్యలు చేపట్టారని అన్నారు. దాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు సద్వినియోగం చేసుకొని ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. యుద్ధప్రాతిపదికన అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ కార్యదర్శి కె. శ్రీనివాసరాజు, ఈఎన్సీ రవీందర్ రావు, సీఈ లు సతీష్, మోహన్ నాయక్, ఎస్.ఈలు మోహన్, శ్రీనివాసరావు పలువురు అధికారులు పాల్గొన్నారు.