నవతెలంగాణ ఆర్మూర్
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నమస్తే నవనాథ పురం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని రాంపూర్, మిర్దాపల్లి గ్రామాల్లో “ప్రజాశీర్వాద యాత్ర” నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు జీవన్ రెడ్డికి డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో , మహిళలు బోనాలతో, వందలాది మంది యువకులు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. వందలాది మంది వెంటరాగా జీవన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ కు ఓటేయాలని, మళ్లీ తనను గెలిపించాలని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన సభల్లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదేండ్లలో మీ గ్రామాల అభివృద్ధికి ఇప్పటి వరకు చేసినవి, ఇక ముందు చేయబోయేవి చెప్పి మరోసారి మీ ఆశీస్సులు పొందడానికి వచ్చానన్నారు. రైతు బంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, పల్లెప్రగతి, మనఊరు-మనబడి, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అన్ని కుల సంఘాలు భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రాంపూర్ గ్రామానికి దాదాపు 15 కోట్ల రూపాయలు, మిర్దాపల్లి గ్రామానికి దాదాపు 25 కోట్ల రూపాయల నిధులొచ్చాయని జీవన్ రెడ్డి వెల్లడిస్తూ పనులు,పథకాల వారీగా ఖర్చు చేసిన వివరాలతో ఈ రెండు గ్రామాల నివేదికలను ప్రజల ముందు ఉంచారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3వేల భృతితో పాటు ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలకు,రైతుబంధు రూ.16 వేలకు పెరుగుతాయన్నారు. అర్హులైన వారికీ రూ. 400కే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.93 లక్షల మందికి రూ. 5 లక్షల చొప్పున వచ్చే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా’ అని ఆయన అన్నారు. 62 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తో గ్రామాలలో జరిగిన అభివృద్ది శూన్యం అని, దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని గ్రామాలు సీఎం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి కి నోచుకున్నాయని జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యం అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ అని అన్నారు. కేసీఆర్ తెచ్చిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయని పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ రాజ్యం కేసీఆర్ తోనే సాధ్యమవు తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ , పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని, భవిష్యత్తులో గ్రామాలను కూడా పట్టణాల లాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2014 ముందు గ్రామాల్లోకి వెళ్లేవారిని దుమ్ము ధూళి ఆవహించి గుర్తుపట్టలేనంతగా రహదారులు ఉండేవని, ప్రస్తుతం ప్రతి రహదారి బీటీ రోడ్డుగా మారింద న్నారు. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి 2014 ముందు సంక్షేమ పథకాలు అందాలంటేనే పైరవీలు , పలుకుబడి ఉన్న వారికే అందిన పరిస్థితుల నుంచి ఎటువంటి ఫైరవీలు లేకుండానే సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు చేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. రాబోయే రోజుల్లో ఇది అభివృద్ధి కొనసాగాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలంతా కెసిఆర్ కు అండగా నిలబడాలని కోరారు. కాగా 2014కు ముందు అంధకారం ఆవరించిన ఆర్మూర్ నియోజకవర్గం నేడు అభివృద్ధి వెలుగులో మెరుస్తోందన్నారు. 3వేల కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని జీవన్ రెడ్డి చెప్పారు. “కాంగ్రెస్ వస్తే మళ్లీ సంక్షోభమే. బీఆర్ఎస్ స్కీము లను కాపీ కొట్టి వదిలిన తాడులేని బొంగరాలే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు. ఓట్ల కోసం రైతులకు పెద్దపీట వేస్తున్నట్లు మేనిఫెస్టోలో పెట్టడం అధికారంలోకి వచ్చాక వారి మెడపై కత్తిపీట పెట్టడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. అవకాశవాద కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలి.
ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే..
హస్తాన్ని నమ్మితే సమస్తం గోవిందే.. సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం..
ప్రజలంతా బీఆర్ఎస్ కు అండగా నిలిచి అభివృద్ధి లో భాగస్వాములు కావాలి. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న. నన్ను మళ్లీ గెలిపించి అసెంబ్లీకి పంపండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ల సర్పంచులు బంటు దయానంద్,, మధువర్మ తదితరులు పాల్గొన్నారు.