కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తున్న మోడీ

– పనిభద్రత, చట్టబద్ద హక్కులకోసం పోరాడాలి
– ఏఐటియుసి జిల్లా సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తూ కార్పొరేట్‌ సంస్థల కుబేరులకు కొమ్ముకాస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఏఐటియుసి జిల్లా కార్యాలయం శేషగిరిభవన్‌లో శుక్రవారం జరిగిన ఏఐటియుసి అనుబంధ ఉద్యోగ, కార్మిక సంఘాల జిల్లా స్థాయి జనరల్‌ మాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిదిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో నుంచి పుట్టిన ఏఐటియుసి నాటి నుంచి నేటి వరకు కార్మికులు, ఉద్యోగుల పక్షాన పోరాడుతూ అనేక హక్కులు, చట్టాలను సాధించిపెట్టిందన్నారు. నూరేళ్ళ చరిత్ర ఉన్న ఏఐటియుసితోనే కార్మికులు, ఉద్యోగుల హక్కులు పరిరక్షించబడతాయన్నారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యాజమాన్యాలకు, పరిశ్రమల పెద్దలకు అనుకూలంగా మార్చే కుట్రలు చేస్తోందని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి శ్రమజీవులను దోచుకునే కుట్రలకు తెరలేపిం దన్నారు. ప్రభుత్వరంగంలో నడవాల్సిన సింగరేణి, బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, విమానయానం వంటి అనేక సంస్థలను కారుచౌకగా అంబాడీ, ఆదానీలాంటి కుబేరులకు అమ్ముతోందని విమర్శించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సమస్యలే ఎజెండాగా జూన్‌ 4న కొత్తగూడెంలో జరిగే ప్రజా, కార్మిక గర్జన బహిరంగ సభకు కార్మికులు, ఉద్యోగులను తరలించే భాద్యతను ఏఐటియుసి నాయకత్వం నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌ పాషా, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాటి ప్రసాద్‌, గుత్తుల సత్యనా రాయణ, రాష్ట్ర్ట నాయకురాలు జె.సీతామహాలక్ష్మి, నాయకులు కె.రత్న కుమారి, గోనె మణి, మంద నిర్మల, విజయలక్ష్మి పాల్గొన్నారు.