– పంట చేలలో మేటలు పోసి.. కల్వర్టులు తెగి ఇబ్బందులు
నవతెలంగాణ-మంగపేట
ప్రకృతి ప్రకోపానికి వారం రోజులుగా జనజీవనం అస్తవ్యస్తం కాగా రోడ్లు తెగి గ్రామాలకు రాకపోకలులేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరో వైపు వరద పంట పొలాల్లో పారి పచ్చని పంటల్లో ఇసు మేటలు వేసి రైతులు ఆగమయ్యారు. మండలంలో కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంతో పాటు కోమటిపల్లి, కొత్తూరు మొట్లగూడెం, బొమ్మాయిగూడెం, రమణక్కపేట, చీపురుదుబ్బ, రాజుపేట తదితర గ్రామాల్లో రోడ్లు ధ్వంసం కాగా కొత్తూరు మొట్లగూడెంలో 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాలు, నర్సాపురం బోరు గౌరారం వాగు పొంగి పసుపులేటి రామకోటమ్మకు చెందిన 6 ఎకరాలు పూర్తిగా కొట్టుకపోయి ఇసుక మేటలు వేయడంతో తీవ్ర పంట నష్టం జరిగినట్లు రైతు రాజశేఖర్ తెలిపారు. మండలంలోని చాలా చోట్ల పంటలు, రోడ్లు ధ్వంసం కాగా అధికారులు సర్వే చేసి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు సత్వరమే చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.