నవతెలంగాణ- హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా కన్నుమూశారు. రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న ఆమె 43 సంవత్సరాల చిన్న వయసులోనే మృతి చెందారు. రచయిత, ఉద్యమకారిణి కూడా అయినా జొలేకా కేన్సర్ చికిత్స కోసం ఈ నెల 18న ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని ప్రధాన భాగాలకు కేన్సర్ కణాలు వ్యాపించినట్టు పేర్కొన్నారు. జొలేకా 1980లో జన్మించారు. ఆమె చనిపోవడానికి ముందు వరకు కూడా రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు. 32 ఏళ్ల వయసులోనే తొలిసారి కేన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. అయితే, 2016లో మరోమారు అది తిరగబెట్టింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. జొలేకా ప్రాణాలు బలితీసుకుంది. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్గానూ అవగాహన కల్పిస్తున్నారు. తనకు కేన్సర్ సోకిన విషయంతో పాటు చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్లో వెల్లడించారు.