– దుబ్బాక లో 14వ రోజుకు చేరుకున్న ఆశ వర్కర్స్ సమ్మె
– మద్దతు తెలిపిన సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు జి. భాస్కర్
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ఆశ వర్కర్ల సమ్మె 14 రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు జి.భాస్కర్ మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశ వర్కర్ల సమ్మె సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రoలోనే ఆశలకు అత్యధిక పారితోషికాలు చెల్లిస్తున్నామనే అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎమ్మెల్యేలు, మంత్రులు,ముఖ్యమంత్రి మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. కానీ ఆషా వర్కర్లకు కాదు అని గుర్తు చేశారు. వెంటెనేఆశ వర్కర్లకు ఫిక్సుడ్ వేతనం రూ.18000 లు, పిఎఫ్,ఈఎస్ఐ వర్తింపజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఆశా వర్కర్లకు ప్రమాద బీమా తోపాటు హెల్త్ కార్డును అందించి ప్రమోషన్ కల్పించాలని అన్నారు. ప్రభుత్వం ఆశలతో అదనపు పనులు చేయిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను పరిష్కారం చేయడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం చలో హైదరాబాద్ అక్టోబర్ 9న కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాకు ఆషా వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆషా వర్కర్లు భాగ్యలక్ష్మి,శ్యామల, మంజుల,శారద,అనిత, బాబాయ్, మనెమ్మ,చంద్రకళ,నాగరాణి,వసుంధర తదితరులు పాల్గొన్నారు.