నవతెలంగాణ – పట్నా
వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్ష పార్టీలు అందుకుతగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి వ్యూహ రచన కోసం జూన్ 12న బిహార్ రాజధాని పట్నాలో కీలకమైన సమావేశం నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష కూటమికి కొంతకాలంగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్న జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ సొంత రాష్ట్రమే ఈ భేటీకి వేదిక కానుండడం గమనార్హం. నీతీశే ఈ సమావేశానికి సారథ్యం వహించనున్నారు. కాగా, 20 ప్రతిపక్ష పార్టీలు ఆదివారం పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఇదే రోజున వాటి భవిష్యత్ సమావేశ తేదీ ప్రకటన వెలువడింది. 18కి పైగా విపక్షాలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇది సన్నాహకమేనని.. ప్రధాన సమావేశం తదుపరి ఉంటుందని చెప్పారు.