ఉద్యమకాలంలో ఉస్మానియా యూనివర్సిటీదే కీలక పాత్ర

– విద్యార్థులు, అధ్యాపకుల పట్ల గౌరవం
– నిజాంకాలేజీ హాస్టల్‌ భవన శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సి టీ కీలకపాత్ర వహించిందని, విద్యార్థులు, అధ్యాపకుల పట్ల తమకు ప్రత్యేక గౌరవం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి కోసం ఎంత అవసరమైతే అంత సహాయం చేస్తామని ప్రకటించారు. రూ.18.75కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘1993-96 వరకు ఈ కాలేజీలోనే చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నిజాం కాలేజీలో చదువుకున్నందు కు గర్వపడతాను. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉంది. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నిజాం కాలేజీలో చదువుకున్న విషయాన్ని గర్వం గా చెబుతాను. యూనివర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ నాలుగో అత్యుత్తమ స్థానాన్ని సాధించడం సంతోషకరం. ఉస్మానియా యూని వర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడు తుంది. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యా ర్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుంది.
టీశాట్‌తో ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం ద్వారా మారుతున్న పరిస్థి తులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యను మరింతమందికి అందజేసేలా ప్రయత్నాలు చేయడం స్వాగతించదగిన విషయం. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిజాం కాలేజ్‌ విద్యార్థి అయినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న ఆయన నిజాం కాలేజీ కోసం కూడ నిధులు ఇవ్వలేదు. డిగ్రీ బాలికల కోసం హాస్టల్‌ వసతి లేనప్పుడు వెంటనే స్పందించి హాస్టల్‌ నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యాశాఖ నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ.40.75 కోట్లు ఇచ్చాం. బాలుర హాస్టల్‌తో పాటు పది అదనపు తరగతి గదులను నిర్మించుకోబోతున్నాం. 15 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నిజాం కాలేజీకి అవసరమైతే అదనపు నిధులను కూడా ఇస్తాం. కాలేజీ గ్రౌండ్‌కు ఇబ్బంది రాకుండా ఈ భవన నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకోసం అదనపు అంతస్తుల్లో భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైతే ప్రత్యేకంగా అనుమతులు ఇస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడిక్‌మెట్‌ వరకు రూ.16 కోట్లతో లింకు రోడ్‌ను వెంటనే మంజూరు చేస్తున్నాం’ అని అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు తర్వాత బాలికలు ఉన్నత విద్యా రంగం లోనూ రాణిస్తున్నా రని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో దాదాపు 60 నుంచి 70శాతం బాలికలు, మహిళలు ఉండడం ఒక మహిళా మంత్రిగా గర్వంగా ఉందన్నారు.
ఫ్యాక్స్‌కాన్‌ సిద్ధంగానే ఉంది కేటీఆర్‌ ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఫ్యాక్స్‌కాన్‌ తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంది. ఆ గ్రూపుతో తమ స్నేహం స్ధిరంగానే ఉంది.ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయి’ అంటూ మంత్రి కేటీఆర్‌ శనివారం ట్వీట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ యూనిట్‌లో రూ.1,656 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఈ నిర్మాణ పనులకు మే 15న కేటీఆర్‌ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.