సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థిగా ‘పాలడుగు భాస్కర్‌’

– 10న పాలడుగు భాస్కర్‌ నామినేషన్‌
నవతెలంగాణ-బోనకల్‌
ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాద్‌ జిల్లా గార్ల పట్టణంలో పాలడుగు చిన్న వెంకయ్య, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు పాలడుగు భాస్కర్‌. దళిత కుటుంబానికి చెందిన పాలడుగు భాస్కర్‌ది నిరుపేద, వ్యవసాయ కార్మిక కుటుంబం. గార్లలో ప్రాథమిక విద్య, మహబూబాబాద్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌, ఖమ్మంలోనే సిద్ధారెడ్డి కాలేజీలో 1992 నుంచి 1995 వరకు డిగ్రీ చదువుకున్నారు. ఈ సమయంలో ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ వామపక్ష భావాలను అలవర్చుకున్నారు. అనంతరం గార్ల మండల ప్రజాశక్తి దినపత్రిక విలేఖరిగా పనిచేశారు. ఈ సమయంలోనే సీపీఐ(ఎం), సీఐటీయులో చురుకైన పాత్ర నిర్వహించారు. 1999లో గార్ల పిఎసిఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గార్ల మండలంలో రైతులకు గిట్టుబాటు ధర, రుణ సదుపాయం కల్పించాలని, కల్తీ ఎరువులను, కల్తీ విత్తనాలను అరికట్టాలని తదితర రైతాంగ సమస్యలపై గట్టి కృషి చేశారు. గార్ల చెరువు కట్ట ఎత్తు పెంపుదాల ఉద్యమం, ములకనూరు ప్రాజెక్టు సాధన కోసం సాగిన ఉద్యమంలో భాస్కర్‌ కీలకమైన పాత్ర పోషించారు. గిరిజన ప్రాంతం గార్లలో పనిచేసిన కాలంలో పోడు భూముల సాధన, అటవీ హక్కుల చట్టం కోసం జరిగిన పోరాటంలో కీలకపాత్ర పోషించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన 3 రైతు చట్టాల రద్దు కోసం సాగిన రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఢిల్లీ సరిహద్దులో సాగిన రైతాంగ పోరాటంలో కూడా భాగస్వాములయ్యారు. పార్టీ అవసరాల రీత్యా జిల్లా నాయకత్వం ఖమ్మం కేంద్రానికి తీసుకువచ్చింది. ఖమ్మం జిల్లా కేవీపీఎస్‌ వ్యవస్థాపక జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పున్నయ్య ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి పోరాటాల నిర్వహించారు. అనంతరం ఖమ్మం జిల్లా సీఐటియు కేంద్రంలో బాధ్యతలు నిర్వహించారు. పార్టీ అవసరాలు దృశ్యం రాష్ట్ర కేంద్రం హైదరాబాద్‌ కు వెళ్లారు. 2003లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌, వీఆర్‌ఏ, భవన నిర్మాణం, హమాలి, ప్రైవేట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌, ఆశ, అంగనవాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ వివోఏలు, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌, మార్కెట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, బేవరేజ్‌ హమాలీల రంగాలకు ప్రధాన బాధ్యతలు చేపట్టి అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. 2006లో కుల వివక్షత అణిచివేతకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు తో కలిసి 13 రోజులు 205 గ్రామాల్లో సైకిల్‌ యాత్రను నిర్వహించారు. 2007లో సిఐటియు అఖిలభారత కౌన్సిల్‌ సభ్యుడిగా, 2016లో ఆల్‌ ఇండియా వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 20 ఏళ్లుగా మునిసిపల్‌ పంచాయతీ, ఇతర రంగాల కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ మున్సిపల్‌ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీలకు నాయకత్వం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీకి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ కొండగుంట వెంకటేశ్వర్లు, వెన్నపూస గోపాల్‌ రెడ్డి, దేవి ప్రసాద్‌, స్వామి గౌడ్‌ లతో కలిసి పిఆర్సి సాధన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగిన 56 రోజుల నిరవధిక సమ్మెలో రాష్ట్రమంతా పర్యటించి ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. 2022లో షెడ్యూల్‌ పరిశ్రమంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం జీవోలను సవరించి వేతనాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ 22 రోజులపాటు 450 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 2023లో గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనాలు పెంపు, కారోబార్లకు ప్రత్యేక హౌదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ 350 కిలోమీటర్లు 17 రోజులపాటు వేసవిలోనే మండుటెండలో పాదయాత్ర నిర్వహించారు. 2022 మార్చిలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ప్రస్తుతం అదే బాధ్యతలో పనిచేస్తున్నారు. 2023లో బెంగళూరులో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో జాతీయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కార్మికుల కూలి, భూమి, ఇండ్ల స్థలాల సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల నిర్బంధకాండను సైతం ఎదుర్కొంటూ శ్రమజీవులు హక్కుల కోసం పోరాటం నిర్వహించారు. పాలడుగు భాస్కర్‌ సిపిఎం పూర్తి కాలం కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నత విద్య పూర్తి చేసుకుని ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30 నవంబర్‌ 2023న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ పాలడుగు భాస్కర్‌ ను మధిర నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. 10న పాలడుగు భాస్కర్‌ తమ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.