నవతెలంగాణ – కోల్కతా: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ తరుణలో బాంబు దాడులు, బుల్లెట్ల వర్షంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 12 మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు, ఒకరు బీజేపీ కార్యకర్త, మరొకరు సీపీఐ(ఎం) పార్టీకి చెందిన కార్యకర్త ఉన్నారు. మిగతా ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయా పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణలను నిలువరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కేంద్ర బలగాలను భారీ మోహరించారు. అల్లరి మూకలు, ఆందోళనకారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, బెంగాల్లో జరుగుతున్న మూడంచెల పంచాయతీ వ్యవస్థలో 73,887 స్థానాల్లో శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,06 లక్షల మంది అభ్యర్థులు పోటీకి నిలబడ్డారు. 22 జిల్లాల్లో 63,229 గ్రామ పంచాయతీ స్థానాలు, 22 జిల్లాల్లో 9,730 పంచాయతీ సమితీ స్థానాలు, 20 జిల్లాల్లో 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అధికార టీఎంసీ పార్టీ 928 జిల్లా పరిషత్ స్థానాలకు పోటీ చేసింది. ఇక 9,419 పంచాయతీ సమితీ స్థానాల్లో, 61,591 గ్రామ పంచాయతీ స్థానాల్లో టిఎంసి పోటీ చేసింది. ఇక బీజేపీ 897 జిల్లా పరిషత్ స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. 7,032 పంచాయతీ సమితీ స్థానాలు, 38,375 గ్రామ పంచాయతీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. సీపీఐ(ఎం) 724 జిల్లా పరిషత్ స్థానాలకు, 6,752 పంచాయతీ సమితీ స్థానాలు, 35,411 గ్రామ పంచాయతీ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. కాంగ్రెస్ 644 జిల్లా పరిషత్, పంచాయతీ సమితి 2,197, గ్రామ పంచాయతీ 11,774 స్థానాల్లో పోటీకి దిగించింది. ఈ ఎన్నికల్లో 5.667 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒక యువకుడితో సహా 12 మంది మృతి చెందారని మీడియావర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. 70వ దశకం చివరలో జరిగిన ఎన్నికల్లో ఒకసారి జరిగాయి. మరలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి జరుగుతున్నాయి. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు 65 వేల మంది కేంద్ర పోలీసులు బలగాలు రంగంలోకి దిగాయి.