– సహాయక చర్యలలో పాల్గొనాలని కేడర్కు పిలుపు
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్తో పాటు హైద్రాబాద్ నగరానికి రెడ్ ఎలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇంకా భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుండాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ కోరుతున్నది.గ్రేటర్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక బస్తీలు మునిగిపోయాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్ధుల హాస్టల్కు నీరు చేరడంతో ఖాళీ చేయించాల్సిన స్ధితి వచ్చింది. చాలా ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అస్తవ్యస్తమయింది. చెరువులు, నాలాలు కబ్జాలకు గురికావడం, ప్రభుత్వానికి దీర్ఘకాలిక దృష్టి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. డ్రైనేజి వ్యవస్థను వెంటనే మెరుగుపర్చాలి. వరదలు వచ్చినపుడు హడావుడి చేయడం కాకుండా ముంపు నివారించేందుకు శాశ్వత పరిష్కార మార్గాల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చూడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోను, ఇతర జిల్లాల్లోను పార్టీ నాయకత్వం, కేడర్ ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయ చర్యలలో ముమ్మరంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నది.