నవతెలంగాణ – తమిళనాడు
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ నెల 28 నుంచి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ముగింపు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. టి.నగర్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం కమలాలయంలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తి, నయినార్ నాగేంద్రన్, అమర్ ప్రసాద్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పొన్.రాధాకృష్ణన్ తదితరులు అన్నామలై పాదయాత్ర విశేషాలు మీడియాకు వివరించారు. ఈ నెల 28న రామనాధపురం జిల్లా రామేశ్వరంలో అన్నామలై పాదయాత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. మొత్తం ఐదు విడతలుగా రామనాథపురం, శివగంగ, మదురై, తేని, విరుదునగర్, తూత్తుకుడి, కన్నియాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో నిర్వహించే తొలివిడత పాదయాత్ర ఆగస్టు 22న పూర్తవుతుందని తెలిపారు. చెన్నైలో జరిగే ముగింపు పాదయాత్రలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నాయకులు తెలిపారు.