నవతెలంగాణ-కొత్తగూడెం
దేశం కోసం తమ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాలని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఎస్పీ వినీత్.జి సూచనల మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ల వారీగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ హాజరై శిబిరాన్ని ప్రాంభించారు. పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు స్థానికులు, యువకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని, రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు. కొత్తగూడెం డీఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరంలో సుమారుగా 120 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్బి సిఐ నాగరాజు, సిఐలు, సబ్ డివిజన్లోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం మహాధానం : డీఎస్పీ
మణుగూరు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని డీఎస్పీ రాఘవేందర్ రావు అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మణుగూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. అమరులైన పోలీసులను స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రమాకాంత్, ఎస్సై రాజేష్, వైద్యులు శశిధర్, మధుసూదన్ రావు, లయన్స్ క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.