![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230911-WA0006-2-300x111.jpg)
నవతెలంగాణ- నసురుల్లా బాద్
పదవులు శాశ్వతం కాదని, పదవీ కాలంలో చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్, సంగెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. హాజీపూర్, సంగెం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టానన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో గతంలో ఎన్నడూ లేని సంతృప్తి కేసీఆర్ హయాంలో కలిగిందన్నారు.పూర్వ కాలంలో రాజులు వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారు, లోకం మంచి మార్గం లో నడిచేందుకు దేవాలయాలు నిర్మించారని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా సాగునీటి వనరులను అభివృద్ధి చేయడం, దేవాలయాల నిర్మాణం జరుగుతుందన్నారు.తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులను ఏడు వేల కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ పథకం ద్వారా మరమ్మతులు చేయించడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు, మజీద్ లు, చర్చిల నిర్మాణానికి రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేశాన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు రాక ఇబ్బందులు పడేవాళ్ళం, ఇప్పుడు ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయలు వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి లాగా దేశంలో ఇంకా ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, మరి 70 ఏళ్ళ నుండి పాలించిన ఈ ముఖ్యమంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో కరంటు లేక రైతులు అవస్థలు పడేవారు నేడు రైతులకు ఉచితంగా 24 గంటలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే 57 సంవత్సరాలకు వృద్దాప్య పెన్షన్ ఇస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల నగదు రైతులకు అందుతుంది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి యాబై లక్షల ఎకరాలకు ఏటా రూ. 15,000 కోట్ల నగదు అందుతుందన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతుబీమా నగదు అందుతుందన్నారు.యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా లక్షా నూటపదహారు రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 14,000 మందికి 130 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చాం.200 కోట్ల రూపాయలతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నాం. జాకోర-చందూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామన్నరు. రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయి. ఇంకా మిగిలిన వారికి మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకంలో ఇంటిని మంజూరు చేస్తామన్నరు. నియోజకవర్గంలో దేవాలయాలు, మజీద్ లు, దర్గాలు, చర్చిల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేశాం. నియోజకవర్గంలో రూ. 30 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో 300 అదనపు తరగతి గదులు నిర్మించాం.
రూ. 12 కోట్లతో 110 అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపిటిసి సభ్యులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.