ధాన్యాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గోదాములు సిద్ధం

– కలెక్టర్‌ అనుదీప్‌
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు జిల్లాలో భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో ప్రత్యేక గోదాములు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. ధాన్యం కొనుగోలు, దిగుమతి తదితర అంశాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా భద్రపరిచేందుకు నాలుగు తాత్కాలిక గోదాములను సిద్ధం చేసినట్లు ఆయన సూచించారు. అకాల వర్షాల వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని రానున్న నాలుగైదు రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రైతులు సంయమనం పాటించి యంత్రంగానికి సహకరించాలని కోరారు. రైతుల ఎవరూ అధైర్య పడుద్దని రాబోవు వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాటా వేసిన తదుపరి సిఎంఆర్‌ మిల్లుల వద్ద డౌన్లోడ్‌ చేయడంలో ఎండ తీవ్రత వల్ల హమాలీలు వడదెబ్బకు గురై సకాలంలో దిగుమతి చేయలేకపోతున్నారని, అందువల్ల జాప్యం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలని ఆయన సూచించారు.