– రెండింతలు పెరిగిన పూల ధరలు
– ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన బంతి పూల సాగు
– బంతి మినహా మండుతున్న అన్ని రకాల పూల ధరలు
– ఖరీదైనదిగా మారిన బతుకమ్మ ఆటాపాట
– నేడు సద్దుల బతుకమ్మ
ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ సందడి చివరి అంకానికి చేరింది. ఆదివారం జరగనున్న చివరి.. పెద్ద బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ కోసం మార్కెట్లు పూలతో నిండాయి. పుడమితో జలంతో పూలతో మానవుల కున్న అనుబంధంతో జరుపుకునే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటుతోంది. ప్రకృతిలో సహజంగా దొరికే పూలతో పేర్చి ఆరాధిస్తూ ఆడిపాడే బతుకమ్మ పండుగకు ఈసారి పూల ధరలు భారంగా మారాయి.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఊరూ వాడా యాడ చూసినా బతుక మ్మల సందడే కనిపిస్తోంది. పట్టణాల్లో మార్కె ట్లన్నీ పూలరాసులతో నిండిపోయాయి. కానీ,పూల ధరలు పెరగడంతో కిలోల కొద్దీ కొనే పరిస్థితి లేదని మహిళలు వాపోతున్నారు.
తొమ్మిది రోజులు.. తీరొక్క పూలు
తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ ఎంగిలిపూలతో ప్రారంభ మై సద్దల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రతి ఏటా దసరా పండుగకు ముందు వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ
సంస్కృతికి ప్రతీకగా నిలిస్తోంది. తంగెడు పూలు, గునుగుపూలు, చామంతి, బంతి, తామర, గడ్డిపూలు ఇలా అనేక రకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. తొమ్మిది రోజుల పాటు వివిధ పద్ధతుల్లో బతుకమ్మల్ని తయారు చేసి ఆడపడుచులు ఆడిపాడుతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకల్ని భారీఎత్తున జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుండటంతో ఊరూవాడల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రయివేట్ కార్యాలయాలు, కంపెనీలు ఇలా ప్రతి చోటా మహిళలు, ఉద్యోగులు, యువతులు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు.
పూల పండుగకు ధరల భారం
గతేడాది కంటే ఈసారి బతుకమ్మ పండుగ సీజన్లో పూల ధరలు రెండింతలు పలుకుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో బంతి, చామంతి, పట్టుగుచ్చు, లిల్లి, గునుగు, గడ్డిపూలు, మల్లె, తామర, గులాబీ వంటి పూల ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ సహా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జహీరాబాద్, పటాన్చెరు, గజ్వేల్ వంటి పట్టణాల్లో పూల ధరలు మండిపోతున్నాయి. బంతి పూలు తప్ప మిగతా అన్ని రకాల పూల ధరలు పెరిగాయి. చామంతి పూలు కిలో రూ.200, పట్టుగుచ్చు పూలు కిలో రూ.150 వరకు అమ్ముతున్నారు. సెంట్రోజా పూలు కిలో రూ.500 ఉంది. కనకాంబరాలు మూర రూ.100, మల్లెపూలు మూర రూ.80 వరకు ఉన్నాయి. గతేడాది కిలో మల్లెపూల ధర రూ.600 ఉండగా, ఈసారి రూ.1200 పలుకుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బంతి పూల సాగు పెరిగింది. సదాశివపేట, కొండాపూర్, జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పూల సాగు పెరిగినా అవి మార్కెట్ అవసరాలకు సరిపోవడం లేదని వ్యాపారులంటున్నారు. రైతుల వద్ద పూల ధర తక్కువే ఉన్నప్పటికీ మార్కెట్కు వచ్చాక ధరలు మూడింతలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నేడు సద్దుల బతుకమ్మ
ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపు కోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మను కూడా వైభవోపేతంగా జరపడంతోపాటు ‘ఓటు హక్కును వినియోగించుకుందాం.. నవంబర్ 30 విధిగా ఓటేద్దాం’ అనే ప్లకార్డుల్ని బతుకమ్మల వద్ద ప్రదర్శిస్తూ ఆడిపాడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు, అధికారులు బతుకమ్మ పండుగ వేడుకల్ని ఓటు హక్కు గురించి చైతన్య పర్చడం, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని విద్యా సంస్థల్లోనూ బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. గ్రామాలు, పట్టణా ల్లోని ఊరూవాడల్లోనూ మహిళలు, యువతులు సద్దుల బతుకమ్మ కోసం పూలను సేకరిస్తున్నారు. మార్కెట్లో లభించే తీరొక్క పూలను కొనుగోలు చేశారు. ఎన్నికల వేళ కావడంలో రాజకీయ నాయకులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. మహిళలతో కలిసి ఆడిపాడుతున్నారు.