– సంక్షేమ భవన్ ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్
హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పదుల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనుపాల కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారిందనీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే హాస్టళ్లను ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు దుప్పట్లు లేక చలికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ హాస్టళ్లలో కనీస అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ హాస్టల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలనీ, అలాగే పెండింగ్లో ఉన్న చార్జీలు వెంటనే చెల్లించాలన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం పక్కా భవనాలు నిర్మించాలనీ, ఖాళీగా ఉన్న వాచ్మెన్, కామాటి, వార్డెన్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు డీజే శివ గౌడ్, పోల్కార్ సాయిరాం, మచ్చ సైదులు, ప్రధాన కార్యదర్శి శివానంద్, అధికార ప్రతినిధి చీమ మహేష్, అమరేందర్, కార్యనిర్వాహక కార్యదర్శులు అజరు నకిరేకంటే గణేష్ జయేందర్, కార్యనిర్వాక కార్యదర్శి కులుకులపల్లి జయేందర్, రవీందర్ నాయక్, అజరు, హరికష్ణ, కార్యదర్శి వినరు, అజరు, రాము తదితరులు పాల్గొన్నారు.