నవతెలంగాణ – అమెరికా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో కూడా.. అక్కడ చిరు ఉద్యోగాలు చేసే వారి పరిస్థితిని తెలుసుకొనేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు తల్జిందర్ సింగ్ అనే డ్రైవర్తో కలిసి ట్రక్కులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. ఈ సమయంలో పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ మూసేవాల ‘295’ పాటను అడిగి మరీ ప్లే చేయించుకొని విన్నారు. ఈ ప్రయాణంలో ఆసాంతం రాహుల్ అక్కడ ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు? ట్రక్కు ఫీచర్లు ఏమిటి..? వారికి చలాన్లు పడతాయా.. వేగ పరిమితి ఎంత..? డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు..? వంటి విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. భాజపా హయాంలో విద్వేషాలను వ్యాప్తిచేస్తున్నారని సదరు డ్రైవర్ చెబుతున్నప్పుడు రాహుల్ సావధానంగా విన్నారు. అనంతరం డ్రైవర్ తల్జిందర్ ఏదైనా పాట వినిపించనా అని అడిగినప్పుడు. ‘ఏదైనా సరే’ అని రాహుల్ పేర్కొన్నాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సిద్ధూ మూసేవాల పాట ప్లే చేయమంటారా అని అడగ్గా.. రాహుల్ అంగీకరించి.. ‘295’ సాంగ్ను ప్లేచేయమని కోరారు. అనంతరం కొద్దిసేపటికి వారి వాహనం ఓ రెస్టారెంట్ వద్ద ఆగగా.. రాహుల్ అందులోకి వెళ్లి అక్కడి వారిని పలకరించారు. అందరితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం కొంచెం ఆహారం తిని ట్రక్కు డ్రైవర్కు వీడ్కోలు పలికారు. ఈ వీడియోను కేవలం రెండు గంటల్లోనే 1.84 లక్షల మంది వీక్షించగా.. 30 వేల మంది లైక్ చేశారు. గత నెలలో దిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్న రాహుల్.. మార్గమధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించారు. అనుకోని అతిథి రాకతో.. ఆ డ్రైవర్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. లారీలో డ్రైవర్ పక్కన కూర్చోవడం, ఓ దాబా వద్ద డ్రైవర్లతో మాటామంతీ తదితర దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. మరోవైపు.. ప్రయాణంలో భాగంగా రాహుల్ గాంధీ.. అంబాలా- చండీగఢ్ జాతీయ రహదారి వెంబడి అంబాలా నగరంలోని గురుద్వారానూ సందర్శించారు.