నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం తెల్లవారుజామున వాన దంచికొట్టింది. నగర వ్యాప్తంగా గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. వాన కురియడంతో.. నగరమంతా చల్లబడింది. ఈ రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్లో 52.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంబర్పేటలో 45.8, శివరాంపల్లిలో 45.3, గచ్చిబౌలిలో 44.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. బీహెచ్ఈఎల్లో అత్యల్పంగా 19 మి.మీ. వర్షపాతం నమోదైంది.