సాగు నీరు విడుదల చేయండి..

Release irrigation water.– చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలు పెంచాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. సాగర్‌ ఆయకట్టులో నీరందక పంటపొలాలు ఎండిపోతున్నాయన్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవకపోవడం వల్ల సాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు రాలేదన్నారు. దీంతో సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొందన్నారు. సాగునీరు వస్తుందని ఆశతో ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకున్నారని, ఇప్పుడు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ సీజన్‌లో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దాని ఫలితంగా బోర్లు, బావుల కింద పంట పొలాలు సైతం ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాగర్‌లో 515 అడుగుల నీటిమట్టం ఉందని.. అందువల్ల నీరు విడుదల చేయాలని కోరారు. గతంలో 510 అడుగులు ఉంటేనే మొదటి విడత నీరు విడుదల చేశారని, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి పంట పొలాలకు ఉపయోగపడిందని చెప్పారు. ప్రస్తుతం సాగునీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని కోరారు. భవిష్యత్‌లో తాగునీరు సమస్య కూడా ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, మండల కార్యదర్శి మూడావత్‌ రవినాయక్‌, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, పోలబోయిన వరలక్ష్మి, వినోద్‌నాయక్‌,నాయకులు పగిడోజు రామ్మూర్తి, చౌగాని వెంకన్న, పాపానాయక్‌, సైదానాయక్‌, కోటిరెడ్డి, కోడిరెక్క మల్లయ్య, భిక్షం, సైదులు పాల్గొన్నారు.