– చంచల్గూడ జైల్లో 1779 ఖైదీ
– తెలంగాణ ద్రోహులతో జతకట్టిండు
– స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా రాంగ్ లీడరెండుకు
– ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి
– సంగారెడ్డిలో బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాది: మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్రెడ్డి ఓ క్రిమినల్ గ్యాంగ్ అని, చంచల్గూడ జైల్లో 1779 నెంబర్ ఖైదీ బెయిల్ మీద తిరుగుతున్నా డని మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం సాధించి తెలంగాణను దేశంలోనే నెంబర్వన్గా అభివృద్ధి చేసిన కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా.. మనకు రాంగ్ లీడర్లు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులంతా జతకట్టి ఎన్నికల ముసుగులో మన దగ్గరికి వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గెలవాలంటే కారు గుర్తుకు ఓటేయాలని, తెలంగాణ ఓడాలంటే రేవంత్రెడ్డి క్రిమినల్ గ్యాంగ్కు ఓటేయాలన్నారు. ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ అసలు పోటీయే చేయడంలేదని, షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారని, ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలుపుతున్నారని తెలిపారు.
అనాడు సంగారెడ్డిని కర్నాటకలో కలపాలని డిమాండ్ చేసిన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ వాళ్లే గాంధీ భవన్లో రేవంత్రెడ్డి బొమ్మలు దగ్ధం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటా రని విమర్శించారు. రేవంత్రెడ్డి ఉస్మానియా విద్యార్థులను అడ్డా కూలీలని, బీరుకు, బిర్యానికి అమ్ముడుపోతారని హేళన చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే సంగారెడ్డి నియోజకవర్గంలో 10 వేల ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ చైర్మెన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మెన్ కాసర్ల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ బొంగుల రవి విజయలక్ష్మీ, వైస్ చైర్మెన్ లతా విజేయేందర్ రెడ్డి, ఎంఏ ముఖీం, మనోహర్గౌడ్, జెడ్పీటీసీ సునీతామనోహర్గౌడ్, బీరయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.