– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
– ప్రజావాణికి 98 ఆర్జీలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజల నుంచి 98 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవడానికి వస్తున్న ప్రతీ ఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు. తీసుకున్న చర్యలపై ప్రజావాణి వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం సమీకత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డా. భాగ్యరెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవడంతో పాటు మహనీయుల స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, లా ఆఫీసర్ చంద్రావతి , సీపీవో మోహన్ రావు , జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.