నవతెలంగాణ పెద్దవంగర: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఉచితంగా చేప పిల్లల సీడ్, సబ్సిడీపై వాహనాలు అందజేస్తుందని గంట్లకుంట సర్పంచ్ చింతల భాస్కర్ రావు అన్నారు. శనివారం గ్రామంలోని పెద్ద చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే, వలలు, ఇతర పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలకు సముచితం స్థానం కల్పించడం హర్షణీయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు పసుల సోమయ్య, ఉపాధ్యక్షుడు సోమసాని సోమయ్య, కార్యదర్శి జిన్న య్యాకయ్య, మొగిలి సాయిలు, జిల్లా ఉపేందర్, పసుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.