రాజద్రోహం పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి.

 Sedition Petitions to the Constitution Bench.న్యూఢిల్లీ : వలసపాలన నాటి రాజద్రోహం (ఐపీసీ 124ఏ సెక్షన్‌) రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు మంగళ వారం సిఫారసు చేసింది. కనీసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుం దని తెలిపింది. ప్రస్తుతం శిక్షాస్మృతి నిబంధనల్లో మార్పులు చేర్పులు చేపడుతున్న నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేయటాన్ని వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సంబంధిత పత్రాలను సీజేఐ ఎదుట ఉంచాలని, తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది. భారత శిక్షాస్మృతిని పున్ణపరిశీలించడంపై సంప్రదింపులు కీలక దశలో ఉన్నాయని కేంద్రం చెప్పడంతో మే 1న ఈ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 11న ఐపీసీ, సీఆర్‌ పీసీ, ఎవిడెన్స్‌ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. కాగా, రాజద్రోహం సెక్షన్‌ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. వి. రమణ 16 నెలల క్రితమే నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీసీలోని సెక్షన్‌ 124ఏ కింద ఎలాంటి కేసులూ నమోదు చేయొద్దని, వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని ఆయన గతేడాది మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు.