నవతెలంగాణ – సూరత్: గుజరాత్లోని సూరత్లో శనివారం ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇంట్లో విగతజీవులై కనిపించారు. వారు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్గా పనిచేసే మనీశ్ సోలంకి(37), అతడి తల్లిదండ్రులు, భార్య, ఆరేళ్ల కుమారుడు, 10, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు వారి ఇంట్లో ప్రాణం పోయిన స్థితిలో కనిపించారు. మనీశ్ సోలంకి మృతదేహం ఉరితాడుకు వేలాడుతుండగా, మిగిలిన వారి మృతదేహాలు మంచం, నేలపైన పడి ఉన్నాయి. ఇంట్లో విషం సీసా, ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరికి అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించలేదని, ఆర్థిక సమస్యలతోనే తాము చనిపోతున్నామని అందులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోలంకి ముందుగా తన కుటుంబ సభ్యులతో విషం తాగించి, ఆ తర్వాత ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.