– గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి మొగిలి సునీత రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో, సుల్తాన్ బజార్
గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ కార్డు పథకాలను వివరిస్తూ గోషామహల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొగిలి సునీత రావు పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం గన్ఫౌండ్రి, బొగ్గులకుంట, కింగ్ కోఠి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డు కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం సునీత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2,500, వంటగ్యాస్ సిలిండర్ 500కి, రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రూ.15వేలు, ఎరువులకు వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి 5లక్షలు తదితర గ్యారంటీ పథకాలను అందిస్తామని ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు ఉషశ్రీ, ఆయా డివిజన్ల మహిళ నాయకురాలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.