దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ శనివారం అనగా సెప్టెంబరు 09, 2023 శనివారం రోజున హైదరాబాద్ డివిజన్లోని నిజామాబాద్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ ఇతర ఉన్నతాధికారులు ఆయనతో కలిసి ఉన్నారు. అరుణ్ కుమార్ జైన్ నిజామాబాద్ స్టేషన్లోని క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, సిబ్బంది బుకింగ్ లాబీ పనితీరును సమీక్షించారు. లోకో పైలట్లు మరియు గార్డులను విధుల కోసం బుక్ చేసిన క్రూ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఆయన పరిశీలించారు. రన్నింగ్ స్టాఫ్కు డ్యూటీకి బుక్ చేసుకునే ముందు సిబ్బంది విశ్రాంతి తీసుకునే గదులు వసతులపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిబ్బందికి తగిన విశ్రాంతి ఉండేలా సిబ్బంది లింకులు సమర్ధవంతంగా రూపొందించబడ్డాయని నిర్ధారిస్తూ, రన్నింగ్ స్టాఫ్ని డ్యూటీకి సరైన సమర్ధవంతంగా వినియోగించేలా చూసుకోవాలని సూచించారు. సిబ్బంది రన్నింగ్ రూమ్ను కూడా ఆయన పరిశీలించారు, అందులో లోకో సిబ్బందికి అందించిన సౌకర్యాలను సమీక్షించారు మరియు లోకో పైలట్లతో సంభాషించారు. స్టేషన్ మేనేజర్ రన్నింగ్ రూమ్ వద్ద ఆయన మొక్కలు నాటారు.జనరల్ మేనేజర్ నిజామాబాద్ రైల్వేస్టేషన్ను పరిశీలించి, స్టేషన్లో ప్రయాణికుల కు అందుతున్న సౌకర్యాలు మరియు వసతులను సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్లోస్టేషన్లో అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రయాణీకులకు సత్వరమే ఆధునిక సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి ప్రణాళికలను సకాలంలో అమలు చేయడంపై ఆయన అధికారులతో చర్చించారు. జనరల్ మేనేజర్ స్టేషన్లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. స్టేషన్లోని యాక్సిడెంట్ రిలీఫ్ రైలు మెడికల్ రిలీఫ్ వ్యాన్ను పరిశీలించారు. అరుణ్ కుమార్ జైన్ నిజామాబాద్ స్టేషన్లోని గూడ్స్ షెడ్ మరియు క్యారేజ్ & వ్యాగన్ డిపోను కూడా పరిశీలించారు. అనంతరం అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు రియర్ విండో ద్వారా తనిఖీని నిర్వహించిన జనరల్ మేనేజర్ ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతా అంశాలను పరిశీలించారు.