నవతెలంగాణ – హైదరాబాద్: లక్ష్మి బరాజ్ నుంచి ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపును అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. సరిపడా వానలు కురవని నేపథ్యం లో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 30 టీఎంసీలకు చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి వరద కాలువ ద్వారా కాళేశ్వర జలాలను శ్రీరాంసాగర్కు తరలించే ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో నీటి నిల్వ నిర్దేశిత 30 టీఎంసీలకు చేరుకున్నది. మరోవైపు పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో ఎస్సారెస్సీలోకి 20 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఈ నేపథ్యంలో కాళేశ్వర జలాల తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వరం జలాశయానికి, అక్కడి నుంచి మిడ్మానేర్కు జలాల తరలింపు ప్రక్రియను కొనసాగించనున్నట్టు తెలిపారు. సోమవారం ప్రాణహితలో వరద సోమవారం మళ్లీ పుంజుకున్నది.