తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యేశల గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం రెంజల్ మండల తాసిల్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈ కాలంలో ఆశ వర్కర్ల పని భారం విపరీతంగా పెరిగిందని, వారి పనికి తగిన వేతనాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశలకు ఇస్తున్న పారితోషకాలను 18వేల రూపాయలకు పెంచి ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలి, ఆశలకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ ఉద్యోగ భద్రతను కల్పించాలని ఆయన అన్నారు. ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షలు, ఆశలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ రామచందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుజాత, రేవతి ,శ్యామల, పద్మ, భాగ్య నాసియా, రూపా, లక్ష్మి, కవిత, సుమలత తదితరులు పాల్గొన్నారు.