– అంగన్వాడీల సమస్యలు పట్టని సర్కార్
– పోరాటంపై ఆంక్షలు.. బెదిరింపులు..
– చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలి:సీఐటీయూ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ పతినిధి
అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పర్మినెంట్ చేయాలని, పెన్షన్, ఎస్ఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలనే తదితర డిమాండ్లతో చేపట్టిన సమ్మె పోరాటం పట్టు సడలకుండా సాగుతోంది. 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లను మూసేసి తమ న్యాయమైన కోర్నెల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి సమస్యల్ని తీసుకెళ్లారు. తాళాలు పగులకొట్టి, నోటీసులిచ్చి, ఫోన్లు, మెసెజ్లతో బెదిరించినా జంకకుండా వేలాది మంది అంగన్వాడీలు మొక్కవోని దైర్యం ప్రదర్శిస్తున్నారు. 42 ఏండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న టీచర్లు, ఆయాలు పర్మినెంట్కు నోచుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా గ్రాడ్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వని ప్రభుత్వ తీరుకు నిరసనగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు.
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వీటి పరిధిలో 35700 చిన్న, పెద్ద అంగన్వాడీ సెంటర్లున్నాయి. వీటిల్లో 70వేల మంది టీచర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 4,57,643 మంది గర్భిణులు, బాలింతలు, 17,02,345 మంది ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అసంపూర్ణ ఆహారం, వైద్య సేవలు పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1504 సెంటర్లు, మెదక్లో 1076 సెంటర్లు, సిద్దిపేట జిల్లాలో 1600 సెంటర్లున్నాయి. వీటి పరిధిలో 36 వేల మంది గర్భిణులు, బాలింతలు, 2.43 లక్షల మంది పిల్లలు సంపూర్ణ ఆహారం పొందుతున్నారు. మాతృ, శిశు మరణాల్ని అరికట్టడంతో పాటు రక్తహీనతను నివారించి పోషక స్థాయిని పెంచేందుకు అంగన్వాడీలు సేవలందిస్తున్నారు. సెంటర్లు నిర్వహిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో బీఎల్ఓలుగా. ఆరోగ్యపరమైన పల్స్పోలియో, ఇతర టీకాలు, కరోనా సేవల్ని కూడా అంగన్వాడీల ద్వారానే చేయిస్తున్నారు.
22 రోజులుగా సెంటర్ల మూత
న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మె విరమణ కావట్లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజులుగా అంగన్వాడీ సెంటర్లు మూతపడ్డాయి. మొదట్లో అధికారులు తాళాలు పగులగొట్టి సెంటర్లు నడపాలని చూసినా ఆయాలు, టీచర్లు సంఘటితంగా పోరాటంలోనే ఉండటంతో సెంటర్లన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో రాష్ట్రంలో లక్షలాది మంది బాలింతలు, గర్భిణులు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు సంపూర్ణ ఆహారం, గుడ్లు, బాలామృతం అందకుండా పోయింది. వైద్య పరంగా వారికి అందించాల్సిన సేవలు కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘ఆరోగ్య లక్ష్మి పథకం’ ద్వారా ప్రతి సెంటర్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట సంపూర్ణ ఆహారంలో అన్నం, పప్పు, ఆకుకూరలు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు అందుతాయి. పిల్లలకు భోజనంతో పాటు టేక్ హౌం రేషన్ కింద 16 కోడిగుడ్లు, 2.5 కిలోల బాలామృతం అందిస్తున్నారు. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించకపోవడం వల్ల సెంటర్లు నడవక లక్షలాది మందికి ఆహారం, వైద్య సేవలు అందడంలేదు. సెప్టెంబర్లో నిర్వహించాల్సిన పోషణ మాసం కార్యక్రమం జరగలేదు.
వినూత్న రీతిలో పోరు
గత నెల 11న అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పోరు 22 రోజులుగా వినూత్న రీతిలో కొనసాగుతోంది. తహసీల్దార్ల కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని సమ్మెకు దిగారు. ఆ శిబిరంలోనే నిరవధిక దీక్షలు చేశారు. ఒంటికాళ్లపై నిల్చోని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్ని ముట్టడించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ కలెక్టరేట్లను ముట్టడించారు. వంటావార్పు, బిక్షాటన, చెవిలోపూలు పెట్టుకోవడం, ఒంటికాలుపై నిలుచోవడం, పొర్లుదండాలు పెట్టడం, అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతులివ్వడం, మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం వంటి అనేక రూపాల్లో సమ్మె కొనసాగుతోంది. ఐసీడీఎస్ మంత్రి చేసిన తప్పుడు ప్రకటనను ఖండిస్తూ ఆమె దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. చర్చలకు పిలిచి పరిష్కరించకపోతే 9న చలో హైదరాబాద్ ముట్టడికి పిలుపు నిచ్చారు.
హామీల విస్మరణ: జి.సాయిలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, సంగారెడ్డి
అంగన్వాడీల సమ్మె పట్ల ప్రభుత్వం ద్వంద వైఖరి అనుసరిస్తున్నది. తాళాలు పగులగొట్టి బెదిరింపులకు పాల్పడింది. అయినా అంగన్వాడీలు జంకలేదు. 1947 పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అనుసరించి చేస్తున్న అంగన్వాడీల సమ్మె చట్టబద్దమైంది. చట్టబద్దమైన సమ్మెలో పెట్టిన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెను ఆటంకపర్చుతున్నారు. విచ్ఛిన్నానికి కుట్ర చేయడం చట్ట విరుద్దం. ముందస్తు నోటీసులిచ్చి అంగన్వాడీలు సమ్మెలోకి వెళ్లారు. ఆగస్టు 18న ఐసీడీఎస్ మంత్రి సత్యవతి అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరిపారు. నిర్ధిష్టమైన హామీలిచ్చిన తర్వాత ప్రభుత్వం మోసం చేసింది. చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె పోరు సాగుద్ది.
42 ఏండ్లుగా అంగన్వాడీల సేవ: మంగ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు
42 ఏండ్లుగా అంగన్వాడీ సెంటర్లు నిర్వహిస్తూ సేవ చేస్తున్నం. మమ్మల్ని పర్మినెంట్ చేయాలని కోరుతున్నం. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ సదుపాయం అనేవి న్యాయమైన డిమాండ్లు. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం దాటవేస్తుంది. వెంటనే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. మొక్కుబడి చర్చలు కాకుండా నిర్ధిష్టమైన పరిష్కారాలు చూపాలి. లేదంటే సమ్మె పోరాటాన్ని ఉధృతం చేస్తాం.