నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆలిండియా లాయర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ ఇస్మాయిల్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. అప్పటివరకు స్నేహితులు, కుటుంబసభ్యులతో ఉల్లాసంగా ఉన్న ఆయన ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇస్మాయిల్ ఆకస్మిక మరణవార్త తెలియగానే ‘ఐలూ’ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నా మనీ, ఇది అత్యంత బాధాకరమని ఐలూ రాష్ట్ర కార్యదర్శి కే పార్థసారధి అన్నారు. ఇటీవల నిర్వహించిన ‘ఐలు’ రాష్ట్ర మహాసభలకు సహకరించడంతోపాటు, ఆయన రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారని తెలిపారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నివాళులు అర్పించారు. ఇస్మాయిల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.