అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య

– మద్యం కోసం అప్పులు చేసిన యువకుడు
– ఏకమైన గ్రామస్తులు.. మద్యం బాటిల్లు ధ్వంసం
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నరేష్ రెడ్డి (37) అప్పుల బాధ భరించలేక మంగళవారం తెల్లవారుజామున తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు మృతదేహాన్ని మృతికి కారణమైన గ్రామంలో ఉన్న బెల్టు షాపు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని గ్రామంలో ఉన్న బెల్టు షాపుల నుండి మద్యాన్ని తీసుకువచ్చి గాంధీ విగ్రహం ముందు ధ్వంసం చేశారు. గతంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో టెండర్ ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే గ్రామస్తులు మూసి వేయించారు. కానీ ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు, ఇతర గ్రామాలకు చెందిన యువకులు ఉదయం నుండి రాత్రి వరకు మద్యం అందుబాటులో ఉండడంతో జోరుగా విక్రయాలు కొనసాగాయి. దీంతో గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి బెల్ట్ షాపు వద్ద అప్పుచేసి మద్యానికి బానిసయ్యాడు. బెల్టు షాపు యజమాని మద్యం డబ్బులు అడగడంతో సోమవారం రాత్రి మరోసారి మద్యం కొనుగోలు చేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి మద్యం సేవించి అప్పుల బాధ భరించలేక జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ఏకమై ఇకనుండి గ్రామంలో మద్యం అమ్మకాలు చేపడితే 5 లక్షల జరిమానా విధించడం జరుగుతుందని తీర్మానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్న తర్వాత చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు. గ్రామ పెద్దలు గ్రామస్తుల సమక్షంలో మద్యం అమ్మకాలు నిషేధమని ఏకగ్రీవ తీర్మానం చేశారు.