నవతెలంగాణ ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించారు. 1999లో పీఏ సంగ్మాతో కలిసి ఎన్సీపీని ఏర్పాటు చేసిన శరద్ పవార్, ఆ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. గతంలో పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించిన మేనల్లుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ సమక్షంలోనే శరద్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, శరద్ పవార్ గత నెలలో ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించి, ఆయననే అధ్యక్షుడిగా కొనసాగాలని సూచించింది. దీంతో పవార్ తన మనసు మార్చుకున్నారు. అయితే ఇది పార్టీ వారసుల అంశంపై చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ను శరద్ పవార్ నేడు ప్రకటించారు.