నవతెలంగాణ – హైదరాబాద్: ఐఆర్సీటీసీలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో టికెట్ బుకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్సైట్, యాప్లో టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవని పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్ఐఎస్ సాంకేతిక బృందం ప్రయత్నిస్తోందని తెలిపింది. సమస్య పరిష్కారమై, సేవలు అందుబాటులోకి వస్తే ఆ సమాచారాన్ని అప్డేట్ చేస్తామని ఐఆర్సీటీసీ ట్విటర్లో పోస్ట్ చేసింది. అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాలైన అమెజాన్, మేక్మైట్రిప్ వంటి బీ2సీ వేదికల ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు.