నవతెలంగాణ – హైదరాబాద్: నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల ఒకటో తారీఖున మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1, 3వ తేదీల్లో రెండు రోజుల విరామంలో రాష్ట్రానికి రెండు సార్లు రానున్న ప్రధాని మోడీ పర్యటనల్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మహబూబ్నగర్, నిజామాబాద్ సభల వేదికగా ఎన్నికల సమరభేరి మోగించనున్నారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచార బరిలో దిగనున్నారు. అక్టోబరు 1న మహబూబ్నగర్లో, 3వ తేదీన నిజామాబాద్లో జరిగే ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.