నవతెలంగాణ – హైదరాబాద్: అనేక రంగాల్లో తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ మాట్లాడారు. హైదరాబాద్ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రం అంటే హైదరాబాద్ మాత్రమే కాదని.. మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. జై తెలంగాణ అంటే కేవలం ఒక నినాదం మాత్రమే కాదు. జై తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి చిహ్నం. నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేయూత అందివ్వాలని కోరుతున్నాను. సరికొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం. తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుకుందాం’’ అని తమిళిసై అన్నారు.