– నిరుద్యోగం, రోడ్లు, అభివద్ధి గురించే…
నవంబర్ 7న మిజోరాంలో ఎనిమిది లక్షల మంది ఓటర్లు రాజకీయ ఆటుపోట్లను నిర్ణయించ నున్నారు. వీరిలో 50,000 మందికి పైగా తొలిసారిగా ఓటు వేయ నున్నారు. ఐజ్వాల్. మిజోరంలో పెద్దసంఖ్యలో యువ ఓటర్లు మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విశ్వవిద్యాలయం , ప్రభుత్వ జాన్సన్ కళాశాలలో చదువుతున్న యువతను పలకరించగా.. తమ రాష్ట్రంలో నిరుద్యోగం, అవినీతి, అభివద్ధి మందగించడం వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించారు. రోడ్ల దుస్థితి గురించిపై కూడా వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
”మేం చాలా నెమ్మదిగా అభివద్ధి చెందుతున్నాం. మా రోడ్లు దెబ్బతిన్నాయి. అనేక అభివృద్ధి సమస్యలు ఉన్నాయి. స్పీడ్గా అభివద్ధి చెందడానికి సహాయపడే పార్టీకి ఈ సారి ఓటు వేద్దాం’ అని అనుకుంటున్న ఓ విద్యార్థి అన్నారు. మరొకరు ఇలా .. ”ముఖ్యంగా విద్యార్థుల అవసరాలు, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి.” అని చెప్పారు.
మిజోరాం జాతిని రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఒక విద్యార్థి ఎత్తి చూపారు. ”మేం మిజోలు మన భాషను రక్షించుకోవాలి, మన మతాన్ని రక్షించుకోవాలి. మన తెగను రక్షించుకోవాలి. మా జాతిని రక్షించడంలో మాకు సహాయపడే రాజకీయ పార్టీ అవసరం. అని నొక్కి చెప్పారు.