నవతెలంగాణ – అమరావతి: బిడ్డకు జన్మనిచ్చిన భార్య పురిటి మంచం మీద ఉండగా, ఆమె భర్త నిర్జీవంగా శవాగారంలో పడి ఉన్న హృదయవిదారక దృశ్యాలు శనివారం తెల్లవారుజామున నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కనిపించాయి. కారంపూడికి చెందిన బత్తిన ఆనంద్ భార్య రామాంజిని గర్భిణి. శుక్రవారం రాత్రి 9 గంటలకు భార్యకు నొప్పులు రావడంతో ఆనంద్ ఆశా కార్యకర్తతో కలిసి ఆమెను కారంపూడి పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యులు లేరని, గురజాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని అక్కడివారు సూచించారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురజాల ఆసుపత్రికి 108 అంబులెన్సులో చేరుకున్నారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఉమ్మనీరు తక్కువగా ఉందని, రక్తహీనత ఉన్నందున మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి 70 కి.మీ. దూరంలోని నరసరావుపేటకు వెళ్లారు. తెల్లవారుజామున రామాంజిని సాధారణ ప్రసవం ద్వారాఆడపిల్లకు జన్మనిచ్చింది. గురజాల నుంచి నరసరావుపేటకు తీసుకెళ్లాలని చెప్పడంతో.. ఆనంద్ తన భార్యను అంబులెన్సులో పంపారు. కారంపూడిలో రూ.20 వేలు అప్పు తీసుకుని నరసరావుపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తూ జూలకల్లు వద్ద రోడ్డుపై గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. కారంపూడి నుంచి అంబులెన్సులో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అసుపత్రిలో ఆనంద్ మృతి చెందారు.