– ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా
– జావెలిన్ త్రోలో పసిడి పతకం సొంతం
– చరిత్ర సృష్టించిన భారత సూపర్స్టార్
నీరజ్ చోప్రా మైదానంలోకి అడుగుపెట్టాడు. నీరజ్ చోప్రా ఈటను విసిరాడు. నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. చరిత్ర పునరావృతం. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. 2023 ప్రపంచ చాంపియన్షిప్స్ చాంపియన్గా అవతరించాడు. 2022 వరల్డ అథ్లెటిక్స్లో రజతం సాధించిన నీరజ్.. ఈసారి బుదాపెస్ట్లో బంగారు పతకం అందుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో బంగారు పతకం సాధించిన భారత తొలి అథ్లెట్గా నీరజ్ చోప్రా చరిత్ర నెలకొల్పాడు.
నవతెలంగాణ-బుదాపెస్ట్
మన నీరజ్ చోప్రా సాధించాడు. నాలుగు దశాబ్దాలుగా భారత్కు అందని ద్రాక్షగా మిగిలిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ బంగారు పతకాన్ని బల్లెం వీరుడు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో అందించాడు. అజర్బైజాన్లోని బుదాపెస్ట్లో ఆదివారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. 88.17 మీటర్లతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత్కు ఇది మూడో మెడల్ కాగా.. నీరజ్ చోప్రాకు ఇది రెండోది కావటం విశేషం. నీరజ్ చోప్రాతో పాటు ఫైనల్లో పోటీపడిన మరో ఇద్దరు భారత జావెలియన్ త్రో అథ్లెట్లు కిశోర్ జెనె, డిపి మనులు వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచారు. టోక్యో ఒలింపిక్స్లో చారిత్రక పసిడి సాధించి ఒలింపిక్ చాంపియన్గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఇప్పుడు బుదాపెస్ట్లో బంగారు పతకం నెగ్గి ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. ఇక ఆదివారం జరిగిన మరో రెండు ఈవెంట్లలో సైతం భారత అథ్లెట్లు ఆకట్టుకున్నారు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో పారుల్ చౌదరి 9:15.31 సెకండ్లలో రేసు ముగించి 2024 పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. మెన్స్ 4 (400) రిలే రేసులో అనాస్, అమోజ్, రాజేశ్, రమేశ్లు 2:59.92 సెకండ్లలో రేసు పూర్తి చేసి ఐదో స్థానంలో నిలిచారు. అమెరికా పసిడి నెగ్గగా.. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నాయి.
రెండో ప్రయత్నంలోనే..
అర్హత రౌండ్లో ఏకైక త్రోతోనే ఫైనల్స్కు అర్హతతో పాటు 2024 పారిస్ ఒలింపిక్స్కు బెర్త్ బుక్ చేసుకున్న నీరజ్ చోప్రా.. పతక వేటలో రెండో ప్రయత్నంలో పసిడి ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్లో 88.77 మీటర్లతో సీజన్ ఉత్తమ ప్రదర్శన చేసినా.. పతక పోరులో కాస్త జోరు తగ్గాడు. కానీ ఇతర జావెలియన్ త్రోయర్లు ఎవరూ నీరజ్కు దరిదాపుల్లోనూ లేరు. తొలి ప్రయత్నంలో సాంకేతికంగా ఫౌల్గా నిలిచిన నీరజ్ చోప్రా.. ఒత్తిడిలో కనిపించాడు. కానీ రెండో ప్రయత్నంలో ఏకంగా 88.17 మీటర్ల దూరం విసిరి విజయ సంబురాలు చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ తరహాలోనే బల్లెం గాల్లో ఉండగానే నీరజ్ చోప్రా పసిడి ఖాయమైనట్టు గర్జించాడు. అత్యుత్తమ త్రో అదేనని అర్థమైందని నీరజ్ వెల్లడించాడు. ఆ తర్వాతి ప్రయత్నాల్లో వరుసగా 86.32 మీటర్లు, 84.64 మీటర్లు, 87.73 మీటర్లు, 83.98 మీటర్ల దూరం విసిరాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో సిల్వర్ మెడల్ సాధించగా.. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ 86.67 మీటర్లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. జర్మనీ స్టార్, మెడల్ ఫేవరేట్ జులియన్ వెబర్ (నాల్గో స్థానం) 85.79 మీటర్లతో పతకానికి అడుగు దూరంలో నిలిచాడు.
నవ చరిత్ర
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత్కు పెద్దగా చెప్పుకునే చరిత్ర లేదు. అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాలు ప్రధానంగా ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఆధిపత్యం చెలాయిస్తాయి. మనోళ్లు అప్పుడప్పుడు మెరిసినా.. పతకాలు సాధించిన దాఖలాలు పెద్దగా లేవు (గతంలో అంజు బాబి జార్జ్, నీరజ్ చోప్రా మాత్రమే మెడల్స్ నెగ్గారు) అటువంటిది, ఓ ఈవెంట్ పతక పోరులో ఏకంగా ముగ్గురు భారత అథ్లెట్లు నిలువటం సరికొత్త చరిత్రే. ఇక ఫైనల్స్ అనంతరం టాప్-6లో ముగ్గురు భారతీయులు నిలువటం సైతం గొప్ప విషయమే. నీరజ్ చోప్రాతో పాటు జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన కిశోర్ జెనా, డిపి మనులు వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచారు. కిశోర్ జెనా 84.77 మీటర్లతో కెరీర్ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. డిపి మను 84.14 మీటర్లతో ఆకట్టుకున్నాడు.
ఇబ్బంది పడుతూనే..!
ఆదివారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో నీరజ్ చోప్రా కాస్త ఇబ్బంది పడుతూనే పోటీ పడ్డాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్కు గాయానికి సంబంధించిన ఒత్తిడే కారణమని నీరజ్ వెల్లడించాడు. ‘తొలి త్రోతోనే బాగా దూరం విసరాలని ఆలోచించాను. కానీ తొలి ప్రయత్నంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. నేను నా గాయం గురించి ఆలోచించసాగాను. పరుగులో వేగం తగ్గింది, జాగ్రత్తపడుతూ వెళ్లాను, స్పీడ్ 100 శాతం లేదు, ఎక్కడో కాస్త తడబడ్డాను. నేను ఇప్పుడు మెరుగు పడాల్సింది అక్కడే. 100 శాతం ఫిట్నెస్తో బల్లెంను మరింత దూరం విసిరేందుకు కష్టపడతాను’ అని నీరోజ్ చోప్రా అన్నాడు. ఇక కెరీర్లో అన్ని విజయాలు అందుకున్నప్పటికీ.. మరింత మెరుగ్గా, అవే విజయాలు సాధించాలనే లక్ష్యమనే ప్రేరణ అని నీరజ్ చోప్రా అన్నాడు. ‘త్రోయర్స్కు ముగింపు గీత ఉండదు అని అంటారు. ఎన్ని మెడల్స్ సాధించింది లెక్క కాదు, ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే స్ఫూర్తి ఎప్పుడూ ఉంటుంది. పతకం సాధించటం అంటే అన్ని నెగ్గినట్టు కాదు. ఎంతో మంది అథ్లెట్లు ఒకే మెడల్ను ఎన్నోసార్లు సాధించారు. ఈ పతకాలు మళ్లీ మళ్లీ నెగ్గేందుకు ప్రయత్నం చేస్తానని’ నీరజ్ తెలిపాడు.
ఆల్ టైమ్ గ్రేట్!
పాతికేళ్ల వయసులోనే జావెలిన్ త్రోలో పతకాలన్నీ సొంతం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. 2016 ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్గా నిలిచిన నీరజ్ చోప్రా.. అదే ఏడాది దక్షిణ ఆసియా క్రీడల్లోనూ విజేతగా నిలిచి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2017 ఆసియా చాంపియన్స్, 2018 ఆసియా గేమ్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకాలు కొల్లగొట్టాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ చరిత్ర లిఖించిన నీరజ్ చోప్రా..భారత అథ్లెటిక్స్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్ పసిడి పతకం సాధించాడు. 2022 డైమండ్ లీగ్ చాంపియన్గా నిలిచిన నీరజ్ చోప్రా.. 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. రజతంతో సంతృప్తి చెందని నీరజ్ చోప్రా.. ఈ ఏడాది బుదాపెస్ట్లో బల్లెంను బంగారు పతకంపై ఎక్కు పెట్టాడు. ఓ అథ్లెట్ జీవిత కాలంలో సాధించలేని అసమాన విజయాలు 25 ఏండ్లలోనే అందుకున్న నీరజ్ చోప్రా.. భారత అథ్లెటిక్స్లోనే కాదు, ప్రపంచ జావెలిన్ త్రో ‘ఆల్ టైమ్ గ్రేట్’గా నిలిచేందుకు అన్ని అర్హతలు సాధించాడు.
‘నా కోసం అర్థరాత్రి వరకు మేల్కొని ఉన్న భారతీయులు అందరికీ ధన్యవాదాలు. ఈ పసిడి పతకం యావత్ భారత దేశానికి అంకితం. నేను ఒలింపిక్ చాంపియన్గా నిలిచా, ఇప్పుడు ప్రపంచ చాంపియన్గా అవతరించాను. భారతీయులం ఏదైనా సాధించగలమని ఈ విజయాలు సూచిస్తున్నాయి. మీ అందరూ మీ రంగాల్లో కష్టపడండి, దేశం గర్వపడేలా చేయండి’
– నీరజ్ చోప్రా
ప్రపంచ చాంపియన్షిప్స్లో నీరజ్ చోప్రా విజయ ప్రదర్శన చూడటం గొప్ప గర్వంగా ఉంది. నీరజ్ అంకితభావం, కష్టపడే తత్వం అందరికీ ఆదర్శం. నీరజ్ చోప్రాకు అభినందనలు. నీ వంటి స్టార్స్తో భారత్ వెలిగిపోతుంది.
– అభినవ్ బింద్రా
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత్కు తొలి పసిడి. భారత క్రీడలకు ఇదో చారిత్రక మైలురాయి. ప్రతి టోర్నీలోనూ నీ హార్డ్వర్క్ నీరజ్ చోప్రాను విజేతగా నిలపాలి.
– సచిన్ టెండూల్కర్
నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు. ఎంతటి అద్భుతమైన ఘనత. నీ విజయం పట్ల ఎంతో గర్వపడుతున్నాం’
– మీరాబాయి చాను
ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రాకు అభినందనలు. చరిత్ర లిఖిస్తూ ప్రపంచ చాంపియన్షిప్స్లో పసిడి సాధించిన నీ చారిత్రక విజయం పట్ల యావత్ దేశం గర్వపడుతోంది’
– రాణి రాంపాల్
ప్రపంచ చాంపియన్షిప్స్లో పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. బంగారు జైత్రయాత్రను కొనసాగిస్తూ.. భారత్కు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’
– పి.టి ఉష