– భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎస్సీలను సామాజిక, ఆర్థిక వివక్ష నుంచి ఆత్మ గౌరవం దిశగా ఎదిగేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉన్నాయని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ పర్యటన సందర్బంగా ప్రగతి భవన్లో సీఎం చంద్ర శేఖర్ రావుతో ఆజాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాగిన సుధీర్ఘ చర్చలో దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరులపై చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న దళిత అభివృద్ధి కార్యాచరణ భవిష్యత్లో దేశంలోని దళితుల సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుందని ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నదన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న గురుకుల విద్య దేశంలో మరెక్కడా అమలు కావట్లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీి, మైనార్టీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. దేశ విదేశాల్లో దళితబిడ్డలు చదువుకునే దిశగా ఆర్థిక సహాయం అందిస్తూ, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని అమలుచేస్తున్న విషయం తాను తెలుసుకున్నానన్నారు.
మహాసభలకు ఆహ్వానం
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఆగష్టు 26 న జరిగే భీమ్ ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్ను చంద్రశేఖర్ ఆజాద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, జి. జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.