నవతెలంగాణ- చండీఘఢ్: పంజాబ్లో ఆప్ ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తనను అసెంబ్లీ వేదికగా అవమానించారని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆరోపించారు. గవర్నర్ ఎన్నో లవ్ లెటర్లు రాస్తున్నారని రాష్ట్ర సీఎం మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి నుంచి సమాచారం కోరే హక్కు గవర్నర్కు ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ తన వ్యక్తిగత వివరాల కోసం సీఎంను అడగలేదని అన్నారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తన లేఖలన్నింటికీ సీఎం బదులివ్వాలని తేల్చిచెప్పారు. తనకు హెలికాఫ్టర్ ఇచ్చారని సీఎం చెబుతున్నారని, తాను దీన్ని అధికారిక కార్యక్రమాలకే వాడుతున్నాను తప్ప వ్యక్తిగతంగా వాడుకోవడం లేదని అన్నారు. తాను రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను సందర్శించగా ఆ సమయంలో తన వెంట పంజాబ్ అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. ఇక తాను పంజాబ్లో ఉన్నంతవరకూ రాష్ట్ర ప్రభుత్వ హెలికాఫ్టర్ను ఉపయోగించనని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రకటించారు.