– ఈ ఏడాది జనవరిలో ఎన్నికల బాండ్ల విక్రయం వాయిదా
– ఆర్టీఐ కింద కేంద్రం వ్యవహార శైలి బహిర్గతం
న్యూఢిల్లీ : షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలక్టోరల్ బాండ్ల విక్రయాన్ని వాయిదా వేసింది. సాధారణ నెల మొదటి సగం నుంచి రెండవ సగం వరకు బాండ్ల విక్రయం జరగాలి. అయితే, బాండ్ల అమ్మకం మూడు ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలకు దగ్గరగా ఉంచాలనే లక్ష్యంతోనే కేంద్రం ఇలా చేసిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైంది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్లలో ఒక్కొక్కటి 10-రోజుల విండోలను కలిగి ఉంటుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల సంవత్సరంలో వరుసగా 15, 30 రోజుల అదనపు విండోలను కలిగి ఉంటుంది. నవంబర్ 7న పారదర్శకత ప్రచారకర్త కమోడోర్ లోకేశ్ కె. బాత్రా (రిటైర్డ్) పొందిన ఆర్థిక వ్యవహారాల శాఖ ఫైళ్ల ప్రకారం.. ఈ ఏడాది కూడా అధికారులు మొదటగా ”ప్రస్తుత పద్ధతి” ప్రకారం జనవరి 1-10 మధ్య విక్రయాలను ప్రతిపాదించారు.డిసెంబరు 21, 2022న డిప్యూటీ డైరెక్టర్ మమత ప్రకారం.. ”ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, త్రైమాసికంలో మొదటి 10 రోజులలో సాధారణంగా ఎలక్టోరల్ బాండ్ల జారీకి విండో అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ నోటిఫికేషన్లో జారీ తేదీలు పేర్కొనబడలేదు” అని వివరించబడింది. ”మూడు ఈశాన్య రాష్ట్రాల రాష్ట్ర శాసనసభలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చు. జనవరి మొదటి 10 రోజుల్లో ఎన్నికల బాండ్లను జారీ చేయడానికి బదులుగా బాండ్లను జనవరి 19 నుంచి 28 జనవరి వరకు జారీ చేయవచ్చు. అంటే, ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరగా..” అని ఆర్థిక వ్యవహారాల సెక్రెటరీ అజరు సేథ్ వ్రాసి, ఆమోదం కోసం ఫైలును కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించారని సమాచారం. అందుకు అనుగుణంగానే సేల్ విండో చివరికి జనవరి 19 నుంచి జనవరి 28 వరకు తెరవబడటం గమనార్హం. అలాగే, 2020 అక్టోబర్లో బీహార్ ఎన్నికలకు ప్రచారం జరుగుతున్నందున ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి విండో అక్టోబర్ 19-28కి జరపబడింది.