– డీఎస్పీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు టి రవీందర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని డీఎస్పీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు టి రవీందర్ అన్నారు. ఈ మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా భూర్జువా పార్టీలు తొక్కి పడుతున్నాయన్నారు. 1952 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో అగ్రవర్ణాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ ఓట్లను దండుకుని పదవులు ఏలుతున్నారని చెప్పారు. ఓట్లు మనవి, సీట్లు వాళ్లకా అని ప్రశ్నించారు. ఇక నుంచి ఓట్లు మనవే,సీట్లు మనవేనని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల ప్రచార నాయకులు భవాని శేఖర్, నాయకులు భవాని కిషన్, గజ్జల భాస్కర్ ఉన్నారు.