నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించడం, మరో కుమార్తె ఇప్పటికే ప్రేమ పేరుతో ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అసహనానికి గురైన ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న కుమార్తెను దారుణంగా పీక కోసి హత్య చేశాడు. బెంగళూరు శివారులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. దేవనహళ్లి తాలూకా బిదనూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. వారం క్రితం చిన్న కుమార్తె ప్రేమ విషయం తెలియగా ఆయన వ్యతిరేకించారు. దీంతో వ్యవహారం పోలీసుల వద్దకు వెళ్లింది. తాను ప్రేమించిన అబ్బాయినే పెండ్లి చేసుకుంటానని యువతి స్పష్టం చేయడంతో పోలీసులు ఆమెను సంరక్షణా కేంద్రానికి తరలించారు. తాజాగా బుధవారం ఉదయం తానూ ఒక యువకుణ్ని ప్రేమిస్తున్నానని పెద్ద కుమార్తె కవన (20) మంజునాథ్కు చెప్పింది. అతడిది వేరే సామాజిక వర్గం కావడంతో పెండ్లి కుదరదంటూ ఆయన తెగేసి చెప్పారు. దీంతో తండ్రీకూతుళ్ల మధ్య రోజంతా గొడవ జరిగింది. ఇద్దరు కుమార్తెలూ ప్రేమ అంటూ పరువు తీస్తున్నారని రగిలిపోయిన మంజునాథ్.. రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత కట్టెతో తలపై కొట్టి, గొంతు కోసి హత్య చేశాడు. గురువారం పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.