మట్టి పని వద్ద కనీస సౌకర్యాలు లేవు

– కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి
– వేసవి అలవెన్స్‌ ఇవ్వాలి
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-చర్ల
మండుటెండలో జాతీయ ఉపాధి హామీ చట్టంలో బాగంగా మట్టి పని చేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు లేవని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, వ్యకాస జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం మండల పరిధిలో గల సుబ్బయ్య కుంటలో జరుగుతున్న ఉపాధి పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి మట్టి పనులు జరుగుతున్న మతలబులను ఆయన వెలికి తీసి విమర్శించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో ఉన్న కూలీలతో సంభాషిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో ఉన్న కూలీలు మాట్లాడుతూ వేతనాలలో జాప్యం ఉందని, మౌలిక వసతులు నీడ, మెడికల్‌ కిట్లు, పనిముట్లకు సంబంధించిన రాయితీలు, మంచినీటి సౌకర్యం సక్రమంగా ఉండటం లేదని తెలిపారు. మాస్టర్‌ రోలు తీసుకుంటున్నారు కానీ రెండుసార్లు ఫోటోలు అప్లోడ్‌ చేయటం వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. వీటితోపాటు పని ప్రదేశంలో నీడ టెంట్లు, పని వస్తువులు లేని కారణంగా ఎండలకు తట్టుకోలేక సృహ కోల్పోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సమ్మర్‌ బోనస్సు తమకు తెలియదని ఉపాధి కార్మికులు అన్నారు. పని ఇవ్వటంలో జాప్యం జరుగుతుందని, సక్రమంగా అడిగిన వారికి అందరికీ పనులు ఇవ్వటం లేదని ఉపాధి కూలీలు తెలిపారు. వేతనాలు సరిగా పడటం లేదని, ధరలు పెరిగాయని కొలతల వలన తమకు ఇబ్బంది జరుగుతుందని అన్నారు. పని జరిగిన రోజులలో పేస్లిప్లు ఇవ్వని కారణంగా ఏ పనికి ఎంత వేతనం చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని మట్టి పని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలు వస్తే ఎవరూ పట్టించుకోవడంలేదని వారు అన్నారు. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఉపాధి పని ప్రదేశాలలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి వ్యవసాయ కార్మిక సంఘం పని ప్రదేశాల సందర్శన చేస్తుందని అందులో భాగంగా మీ వద్దకు వచ్చి తెలుసుకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కూలీ పడేవిధంగా ఈ ఎండాకాలం వరకైనా కొలతలతో సంబంధం లేకుండా కనీసం 300 రూపాయలు వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మర్‌ బోనస్సు ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలలో ఇస్తారని దీనిని కూడా కూలీలకు వివరించాలని కోరారు. ఉపాధి కూలీల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అలాగే జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో ఈ సమస్యలపై కూలీలను సమీకరించి మండల కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. తద్వారా అధికారులకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఉపాధి హామీకి చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయకూడదని కోరారు. ఫోటోలు అప్లోడ్‌ సిస్టం లో కూడా మార్పు తీసుకురావాలని కోరారు. ఉపాధి కూలీల సమస్యల సాధన కోసం ఈ నెల 25న జరిగే హైదరాబాదులో ఉపాధి కూలీల రాష్ట్ర ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. పని ప్రదేశం సందర్శనలో శ్యామల వెంకట్‌, నరసింహమూర్తి, ముఠామేస్త్రిలు, కూలీలు పాల్గొన్నారు.